ఐదేళ్ల లోపు పిల్లలందరికీ చుక్కలు వేయించాలని మున్సిపల్ మేయర్ పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతిసారి రెండు చుక్కలు వేయించడం ద్వారానే పోలియో మహమ్మారిపై నిరంతర విజయం సాధ్యమవుతుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ సంక్షేమ శాఖ, మిషన్ డైరెక్టర్ ఎన్హెచ్ఎం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలియో దినం కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ ఆదిత్య స్కూల్లో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేళ్ల లోపు వయస్సు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసిన మేయర్, చిన్న పిల్లలకు ఈ చుక్కలు వేయించాల్సిన అవశ్యకత గురించి తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల భవిష్యత్తును సురక్షితంగా మార్చడానికి పోలియో చుక్కల కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని మేయర్ ధర్ని మధుకర్ వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అర్హులైన పిల్లలందరికీ వంద శాతం పోలియో చుక్కలు అందేలా వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్తో పాటు స్థానిక ఏఎన్ఎం కవిత, 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపతి తిరుపతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆశా కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.







