నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణానికి చెందిన వంగపెల్లి సహస్ర బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్టు మంచిర్యాల ఎస్ఆర్ డిజి స్కూల్ ప్రిన్సిపాల్ కొడారి కుమారస్వామి తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు వంగపెల్లి చంద్రశేఖర్, రజితలు కిరణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ డిజి స్కూల్ డీజీఎం లక్ష్మణ రావు, జోనల్ ఇంచార్జ్ అనంతుల శశిధర్, ఉపాధ్యాయులు సహస్రను అభినందించారు.
KYATHAM RAJESH
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని సింగరేణి కాన్ఫరెన్స్ హాల్ లో మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ ను 2000వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీకి పూల మొక్క అందజేసి, శాలువాతో సత్కరించారు. 2000వ సంవత్సరంలో అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు తాము శిక్షణ పొందినట్లు వారు తెలిపారు. అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ ను కలిసిన వారిలో కానిస్టేబుళ్లు బుద్దె రవి, ఉపేందర్, రాజు, రవి, మల్లా రెడ్డి, చంద్రమోహన్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.
- విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- నూతన భూగర్భ గనులు ప్రారంభించాలి
- హెచ్ఎంఎస్ త్రై వార్షిక మహాసభలను విజయవంతం చేయాలి
- హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తామని జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ, ఆగస్టు 23, 24 తేదీల్లో హెచ్ఎంఎస్ త్రై వార్షిక మహాసభలు శ్రీరాంపూర్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా నూతన భూగర్భ గనులు ప్రారంభించి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గోలేటి నుండి సత్తుపల్లి వరకు కార్మిక భరోసా యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. సింగరేణి మెడికల్ బోర్డు అవినీతి మయంగా మారిందని, మెడికల్ బోర్డు రద్దుచేసి గతంలో మాదిరిగా రెండు సంవత్సరాల సర్వీసు ఉన్న కార్మికులను అన్ ఫిట్ చేసి వారసులకు ఉద్యోగం కల్పించాలని అన్నారు. ఎస్.టి.పి.పిలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విభాగం పట్టించుకోవడంలేదని, షిఫ్ట్ మార్పు, చార్జిషీట్ పెండింగ్ లో ఉంచడానికి, ప్రమోషన్ యాక్టింగ్ ల కొరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. గతంలో గెలిచిన కార్మిక సంఘాలు కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కొన్ని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్న కార్మికులను బదిలీలు, సెక్షన్లు మారుస్తారని, చార్జిషీట్లు ఇస్తారని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 19న గోదావరిఖని జరిగిన హెచ్ఎంఎస్ సెంట్రల్ కమిటీ సమావేశంలో తిప్పారపు సారయ్యను సింగరేణి మైనర్స్, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం తిప్పారపు సారయ్య మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని, కార్మికుల సమస్యల పరిష్కారానికి అలుపెరుగని కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, నాయకులు గోల్ల సత్యనారాయణ, దుర్గం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- నారాయణ పాఠశాలలో ఘనంగా వనమహోత్సవం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: విద్యార్థి దశ నుంచే మొక్కలు నాటడం అలవర్చుకోవాలని నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్య రావు అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్య రావు పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తమ ప్రత్యేకమైన రోజుల్లో మొక్కలు నాటి సంరక్షించాలి కోరారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ఉపయోగాలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాదిశెట్టి కవిత, జోనల్ అనలిస్ట్ రాజేందర్, ఏవో సంజీవ్, వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆక్టివేట్ ఇంచార్జ్ గోపతి జ్యోతి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: వర్షాకాలంలో సంక్రమించే సీజనల్ వ్యాధుల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గని పై వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షా కాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల బెడద తీవ్రంగా ఉంటుందని, నివాస ప్రాంతాల్లో మురికి నీరు నిలువకుండా, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏడిఎస్ ఈజీ దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందే భయంకరమైన వ్యాధి డెంగ్యూ అని, ఈ దోమలు పగటి వేళ కుడతాయని, దోమ కుట్టిన ఐదు నుంచి ఎనిమిది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. డెంగ్యూను నివారించడానికి ఎలాంటి టీకాలు లేవని, దోమ కాటుకు గురి కాకుండా దోమ తెరలు వాడాలని, నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నీటి ట్యాంకులను మూసి ఉంచాలని, వర్షపు నీరు నిల్వ ఉండే కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె 7 గని మేనేజర్ జె. తిరుపతి, గుర్తింపు సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ కొట్టె కిషన్ రావు, గని రక్షణ అధికారి సంతోష్ రావు, ఇంజనీర్లు ప్రవీణ్, సుధీర్, వెంటిలేషన్ ఆఫీసర్ జగదీష్ రావు, అండర్ మేనేజర్లు రవీందర్, రాము, రాజు, పిట్ సెక్రటరీ మారెపల్లి సారయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు స్టేట్ చైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ, సంస్థ నియమ, నిబంధనలు పాటిస్తూ, సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని, ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని, పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.
- పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
- మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్
- సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మంచిర్యాల డిసిపి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. తదుపరి స్టేషన్ రికార్డ్ తనిఖీ చేయడంతో పాటు పెండింగ్ కేసుల నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్షీట్కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులను స్టేషన్ హౌజ్ ఆఫీసర్ యు. ఉపేందర్ రావును అడిగి తెలుసుకున్నారు. నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించాలని, మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, దొంగతనాలు జరగకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వుంటూ, విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, చోరీలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతోపాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో అధికారులు సమయస్పూర్తితో దర్యాప్తు కొనసాగించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



