- రోడ్ల విస్తరణ, అండర్ డ్రైన్ పనులకు సహకరించాలని విజ్ఞప్తి
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మార్కెట్ ఏరియాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు. శనివారం మార్కెట్ పరిసరాల్లో పర్యటించిన ఆయన, వ్యాపారస్తులతో ముఖాముఖి చర్చించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ పురోగతి కోసం చేపట్టబోయే భూగర్భ మురికి కాలువ (అండర్ డ్రైన్), రహదారుల విస్తరణ పనులకు వ్యాపారస్తులు, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
మార్కెట్ ఏరియాలోని అర్చన టెక్స్ చౌరస్తా వద్ద పర్యటించిన ఎమ్మెల్యే, రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. మార్కెట్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పనుల వల్ల మార్కెట్ ప్రాంతం సరికొత్త రూపు సంతరించుకుంటుందని, ట్రాఫిక్ సమస్యలు తొలగి వ్యాపార కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
అనంతరం అభివృద్ధి పనుల రూపకల్పన, అమలుపై సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో, ప్రణాళికాబద్ధంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక వ్యాపారస్తులు పాల్గొన్నారు.









