- ప్రగతి స్టేడియంలో పనులను పరిశీలించిన శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో ఈ నెల 26న నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్సవాలకు సంబంధించిన ముందస్తు పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణలో
ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆయా విభాగాల అధిపతులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనే వారందరికీ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేడుకల్లో భాగంగా వివిధ గనుల్లో ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగులకు సన్మానం, మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో శ్రీరాంపూర్ ఏరియా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, డీజీఎంలు ఆనంద్ కుమార్, రవీందర్, ఏబీ హరి నారాయణ, క్వాలిటీ మేనేజర్ కె. వెంకటేశ్వర రెడ్డి, డీవైపీఎం ఎం. రాజేష్, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి పాల్గొన్నారు.





