- ఐటీ మాఫీ, మెడికల్ బోర్డు పునరుద్ధరణపై జనక్ ప్రసాద్ విజ్ఞప్తి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నాన్ని త్వరలోనే సాకారం చేస్తామని మినిమమ్ వెజ్ బోర్డ్ చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ వెల్లడించారు. సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కులు, పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలను ఇటీవల ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులు ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రివర్గానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక కమిటీని నియమిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. కార్మికుల పెర్క్స్పై విధిస్తున్న ఆదాయపు పన్నును పూర్తిగా మాఫీ చేయాలి. లేదంటే ఆ మొత్తాన్ని కార్మికులకు రీయింబర్స్మెంట్ రూపంలో తిరిగి చెల్లించాలి. మెడికల్ బోర్డును పునరుద్ధరించి 95 శాతం వరకు మెడికల్ ఇన్వాలిడేషన్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. ఉద్యోగుల పేర్ల మార్పులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గానికి వివరించారు. ఈ డిమాండ్ల సాధన ద్వారా కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న జనక్ ప్రసాద్ ను టీపీసీసీ నాయకుడు పెర్క శ్యామ్, ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు కలిసి సన్మానించారు. జనక్ ప్రసాద్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ డివిజన్ ఐఎన్టీయూసీ ప్రతినిధులు పాల్గొన్నారు.







