అన్ని స్థానాల్లో జెండా ఎగురవేస్తాం
మంచిర్యాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా
నస్పూర్, ఆర్.కె న్యూస్: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై ఎమ్మెల్యేతో కలిసి చర్చించారు. మంచిర్యాల కార్పొరేషన్ లోని 60 డివిజన్ స్థానాల్లో, లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని 15 కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని మంత్రి వెల్లడించారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్త స్కీమ్ లను అమలు చేస్తున్నామని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు చేస్తే, గత పాలకులు ఫోన్ ట్యాపింగ్ వంటి నీచమైన చర్యలకు పాల్పడటం దిగజారుడుతనమని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని స్పష్టం చేశారు.
అనంతరం చెన్నూర్ నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఆశావాహులతో సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక సర్వేల ఆధారంగానే ఉంటుందని తేల్చి చెప్పారు. మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలు వేశామని తెలిపారు. టికెట్ ఎవరికి వచ్చినా విభేదాలు పక్కన పెట్టి చేయి గుర్తు విజయం కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. క్యాతనపల్లి పుర పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







