కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి అభ్యర్థులను గెలిపించాలి
బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించి, కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ జోన్ అధ్యక్షులు సత్రం రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభించిందని గుర్తుచేశారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో సర్పంచులు, వార్డు సభ్యులు గెలుపొందడం పార్టీ బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని ఆయన కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో అభ్యర్థుల విజయానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పబ్బతినేని కమలాకర్ రావు, కార్పొరేషన్ ఎన్నికల జోన్ అధ్యక్షులు దూట రాజకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామ్రాజ రమేష్, మల్క రాజేశం, మల్లోత్ జ్యోతి, శ్రీరాంపూర్ జోన్ ప్రధాన కార్యదర్శి పొన్నవేని సదయ్య, సీనియర్ నాయకులు మిట్టపల్లి మొగిలి, శక్తి కేంద్ర ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







