మంచిర్యాల నుంచి కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన ప్రయాణం
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్ ఆదివారం మహా పాదయాత్ర చేపట్టారు. సీతారాంపల్లిలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన హనుమాన్ స్వాముల బృందంతో కలిసి కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన బయలుదేరారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని, 2029 ఎన్నికల్లోనూ విజయం సాధించి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలని ఈ మొక్కు మొక్కుకున్నట్లు మేయర్ తెలిపారు. ఎమ్మెల్యే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని మేయర్ ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని వేడుకున్నారు. యాత్ర సాఫీగా సాగాలని భక్తులు జయజయధ్వానాలు చేశారు. సీతారాంపల్లి హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మేయర్తో పాటు స్థానికులు, హనుమాన్ స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మహా పాదయాత్ర ప్రారంభోత్సవంలో పీసీసీ సభ్యుడు, నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నూకల రమేష్, 33వ డివిజన్ కార్పొరేటర్ ఎంబడి కుమార స్వామి హాజరై యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నాయకులు, కార్యకర్తలు మేయర్కు సంఘీభావం తెలుపుతూ యాత్రలో అడుగులు వేశారు. భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమైన ఈ పాదయాత్ర కొండగట్టు అంజన్న ఆలయం వరకు కొనసాగనుంది.



