శ్రీరాంపూర్ బిఎంఎస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) కార్యాలయం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బాబాసాహేబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికే పరిమితం కాదని, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా ఆయన భారతీయులందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడని కొనియాడారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. దేశంలోని అన్ని మతాలు, కులాలు, వెనుకబడిన వర్గాలకు సమన్యాయం జరిగేలా అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని, తద్వారా భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పారని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పబ్బతినేని కమలాకర్ రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జాయింట్ సెక్రటరీలు భూంపల్లి రమేష్, బోయిన మల్లయ్య, దుంపల శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జెల్ల తిరుపతి, డివిజన్ నాయకులు చల్లా ప్రశాంత్, బొమ్మకంటి కిషన్, పిట్ సెక్రటరీలు కొమ్మ బాపు, కాంపల్లి తిరుపతి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు కుమ్మరి చంద్రశేఖర్, కుంట రాజు, చల్లా శ్రీనివాస్, ప్రైవేట్ సెక్టార్ ప్రతినిధులు నీరటి సురేష్ కుమార్, కానవేన స్వామి, మిట్టపల్లి మొగిలి తదితరులు పాల్గొన్నారు.



