- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థుల ఘనత
నస్పూర్, ఆర్.కెన్యూస్: సింగరేణి వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో శ్రీరాంపూర్ సింగరేణి హైస్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు అత్యుత్తమ మార్కులు సాధించడం గర్వకారణమని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ప్రశంసించారు. బుధవారం విడుదలైన తెలంగాణ పదవ తరగతి వార్షిక ఫలితాలలో ఈ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. గత విద్యాసంవత్సరంలో 98 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 100 శాతం ఫలితాలతో సింగరేణి ఏరియాలోనే అగ్రగామిగా నిలిచింది. సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగి కుమార్తె బి. శ్రీనిధి 559 మార్కులతో స్కూల్ టాపర్గా నిలవడమే కాకుండా మండల స్థాయిలో మూడవ స్థానం కైవసం చేసుకుంది. మొత్తం 12 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటారు. టాపర్గా నిలిచిన శ్రీనిధితో పాటు 549 మార్కులు సాధించిన మహిదర్, 526 మార్కులు పొందిన నూరాన్లను జీఎం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన కరస్పాండెంట్ ఎం. రాజేష్, హెడ్ మాస్టర్ బి. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందాన్ని జీఎం అభినందించారు. కార్పొరేట్ జీఎం (ఎడ్యుకేషన్) వెంకటాచారి సైతం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు హెడ్ మాస్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణ, డీజీఎం రాజన్న, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



