పాస్పోర్ట్, వీసాతో పాటు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: అమెరికాలో ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణానికి చెందిన లగిశెట్టి స్పందన కుటుంబానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పెద్ద దిక్కుగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. లగిశెట్టి శ్రీనివాస్ కుమార్తె అయిన స్పందన ఉన్నత చదువుల కోసం అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లింది. అయితే, ఇటీవల అక్కడి ఒక మెట్రో స్టేషన్లో స్పందన ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమె కోమాలోకి వెళ్లి ప్రస్తుతం అక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోంది. కుమార్తె పరిస్థితి తెలిసి తీవ్ర ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు తమకు అర్ధరాత్రి వేళ అమెరికా వెళ్లే మార్గం కనిపించక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ఆశ్రయించారు. విషయం వినగానే చలించిపోయిన ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. అత్యవసరంగా స్పందన తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు వీలుగా సీఎంఓ ఉన్నతాధికారులతో స్వయంగా మాట్లాడి పాస్పోర్ట్, అత్యవసర వీసా మంజూరు చేయించారు. అంతేకాకుండా, వారి విమాన ప్రయాణ టికెట్లు, ఇతర అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ. 3,00,000 ఆర్థిక సాయాన్ని బాధిత తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ.. ఆ భగవంతుడి ఆశీస్సులతో స్పందన అతి త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. విదేశాల్లో ఉన్నా మన బిడ్డకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తరపున కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో స్పందించి తమను అమెరికా పంపించే ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యేకు స్పందన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.



