గోదావరిఖని బాలుడికి మంచిర్యాల కాకతీయ హాస్పిటల్లో చికిత్స
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన నాలుగేళ్ల బాలుడు అయన్ ప్రమాదవశాత్తు రాగి నాణేన్ని మింగగా, మంచిర్యాలలోని కాకతీయ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ వైద్యులు ఎండోస్కోపీ ద్వారా దానిని విజయవంతంగా తొలగించారు. ఆడుకుంటూ నాణేన్ని నోట్లో పెట్టుకున్న బాలుడు దానిని మింగేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బాలుడిని మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు బాలుడికి అత్యవసర పరీక్షలు నిర్వహించి నాణెం కడుపులో ఉన్నట్లు గుర్తించారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నవీన్ ఆడెపు నేతృత్వంలో ఎండోస్కోపీ ప్రక్రియను చేపట్టారు. ప్రత్యేకమైన నెట్ సహాయంతో కడుపులో ఉన్న రాగి నాణేన్ని బయటకు తీశారు. శస్త్రచికిత్స లేకుండానే నాణేన్ని తొలగించడంతో బాలుడు ప్రమాదం నుండి బయటపడ్డాడు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి చికిత్స అందించిన వైద్య బృందానికి బాలుడి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నవీన్ సూచించారు. పిల్లలకు చిన్నపాటి వస్తువులు, నాణేలు, ప్రమాదకరమైన ఆటవస్తువులను ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఏదైనా వస్తువు మింగినట్లు అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.







