ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న ఎర్రటి పూల సోయగం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సాధారణంగా మే నెలలో పూసే ‘మే పుష్పాలు’ ఈ ఏడాది మార్చి రెండో వారంలోనే వికసించి ప్రకృతి ప్రేమికులను అబ్బురపరుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సీతారాంపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు రాజ్ కుమార్ ఇంటి ఆవరణలో ఈ అరుదైన పుష్పాలు వికసించి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే అతిథిలా వచ్చి ఆకర్షించే ఈ పూల కోసం ప్రకృతి ప్రేమికులు ఆత్రుతగా వేచి చూస్తారు. ఈ సారి ఎండల ప్రభావమో లేదా వాతావరణ మార్పుల
వల్లనో గానీ నెల రోజుల ముందే ఇవి పూయడం విశేషం. ఏకధాటిగా నాలుగు పూలు పూయడంతో స్థానికులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. పుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే అరుదైన జాతికి చెందిన ఈ పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎరుపు వర్ణంలో, గుబురుగా బంతి ఆకారంలో ఉండే ఈ పుష్పాలు ఏప్రిల్, మే నెలల్లో వికసిస్తాయి. దుంప రకానికి చెందిన ఈ మొక్కలు భూమిలో విస్తరిస్తూ ఒక్కో దుంపకు ఏడాదికి ఒక పువ్వును మాత్రమే పూస్తాయి. సుమారు రెండేళ్ల క్రితం ఒక నర్సరీ నుంచి తెచ్చిన దుంపలను రాజ్ కుమార్ తన ఇంటి వద్ద నాటారు. మొదటి ఏడాది ఒక పువ్వు మాత్రమే పూయగా, ఈసారి మొక్కలు విస్తరించి నాలుగు పూలు వికసించాయి. ఇసుక నేలల్లో బాగా పెరిగే ఈ మొక్కలు మొగ్గ తొడిగిన నాటి నుంచి వికసించడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. ఇవి రోజులో సుమారు నాలుగు గంటల పాటు పూర్తిగా వికసించి ఉంటాయి. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని ప్రకృతి ప్రేమికుడు రాజ్ కుమార్ కోరారు. పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ ను ఆదర్శంగా తీసుకుని గత కొన్నేళ్లుగా పర్యావరణ హిత కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. చెట్లను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ముందే వికసించిన ఈ మే పుష్పాలను చూసి ఆనందిస్తున్న పర్యావరణ ప్రేమికులు, స్థానికులు వాటి వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.







