సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల దాసు
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన పండ్ల వ్యాపారి కుమార్తెకు ఘన సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఏకారి లిఖిత ప్రతిభ అందరికీ స్ఫూర్తిదాయకమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల దాసు అన్నారు. నస్పూర్ మండలం అరుణక్కనగర్కు చెందిన ఏకారి లిఖిత జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా శుక్రవారం మేకల దాసు ఆమెను స్వయంగా కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు. పట్టుదలతో చదివి న్యాయశాఖలో అత్యున్నత కొలువు సాధించిన లిఖితను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. లిఖిత తల్లిదండ్రులు లక్ష్మి, వెంకటేష్ సీసీసీ కార్నర్ వద్ద చిన్న పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల శ్రమను చూస్తూ పట్టుదలతో చదివిన లిఖిత ఇటీవల విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. న్యాయశాఖలో కీలకమైన పదవికి ఎంపికయ్యారు. లిఖిత సాధించిన విజయం పట్ల సీపీఐ, శ్రీరాంపూర్ ఏరియా పండ్ల వర్తక సంఘం ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు మేకల దాసు వెల్లడించారు. శ్రమించే తత్వం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ సందర్భంగా మేకల దాసు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ శ్రీరాంపూర్ శాఖ కార్యదర్శి పూజారి రామన్న, పుల్ల రమేష్, గాజుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.







