ప్రకృతి మిత్ర కార్యాలయంలో తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం, ప్రతి సైకాలజిస్ట్ ఈ సామాజిక బాధ్యతను గుర్తించి పనిచేయాలి” అని టీపీఏ జిల్లా అధ్యక్షులు, అడ్వొకేట్, కౌన్సిలింగ్ సైకాలజిస్టు రంగు వేణు కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (టీపీఏ) పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ రోడ్డులోని ప్రకృతి మిత్ర కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోత్కూరి రాంచందర్ సూచనల మేరకు జరిగిన ఈ వేడుకల్లో వేణు కుమార్ కేక్ కట్ చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈ ఏడాది టీపీఏ ఈవెంట్ క్యాలెండర్లోని కార్యక్రమాల అమలుపై చర్చించారు. మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైకాలజీ కన్వెన్షన్ నిర్వహించాలని తీర్మానించారు. మే 9, 10 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర కన్వెన్షన్ మరియు అవార్డుల ప్రధానోత్సవంలో జిల్లా నుంచి పలువురు సైకాలజిస్టులు పాల్గొంటారని వెల్లడించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్త కార్యక్రమ నిర్వహణకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర కమిటీని కోరారు. ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సుప్రీంకోర్టు జారీ చేసిన 15 కీలక మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయాలని వేణు కుమార్ డిమాండ్ చేశారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యాసంస్థల్లో సైకాలజిస్టులు, కౌన్సిలర్ల నియామక ప్రక్రియలో టీపీఏ తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ సుమన చైతన్య, అడ్వైజర్ గుండేటి యోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, తాళ్లపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.







