- మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్
- రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండి ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు, చికిత్సలు అందించాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ స్పష్టం చేశారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యుల హాజరు పట్టికను, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, మందుల నిల్వలను మేయర్ స్వయంగా పరిశీలించారు. సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేంద్రాలను నిర్వహిస్తోందని, ఇక్కడ నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోగులను పెద్ద ఆసుపత్రులకు రెఫరల్ చేయాలని సూచించారు. అనంతరం మేయర్ జిల్లా వైద్యాధికారితో ఫోన్లో మాట్లాడి, ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను వివరించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కంకణాల శ్యాంసుందర్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.







