- ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు
- శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఓటు జీఎంకు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో ఉన్నత విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన అధికారిగా నల్లగుంట సత్యనారాయణ విశేష గుర్తింపు పొందారని ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు కొనియాడారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఓటు జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ పొందనున్న నల్లగుంట సత్యనారాయణకు బంగ్లాస్ ఏరియాలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఐఎన్టీయూసీ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనారాయణ సింగరేణిలో ఆర్కే 6 గని మేనేజర్గా, ఆర్కే 7 గ్రూప్ ఏజెంట్గా, కైరిగూడ ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సంస్థ అభివృద్ధికి విశేష సేవలందించారని ఈ సందర్భంగా శంకర్ రావు గుర్తుచేశారు. సత్యనారాయణ సుదీర్ఘకాలం సింగరేణిలో సేవలందిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను, భద్రతను సమన్వయం చేస్తూ తోటి అధికారులకు ఆదర్శంగా నిలిచారని ఐఎన్టీయూసీ నాయకులు ప్రశంసించారు. గనుల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టి భద్రతా ప్రమాణాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపించారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా తమ అపార అనుభవాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు గరిగ స్వామి, పి. తిరుపతి రాజు పాల్గొన్నారు.







