- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- కనీస వేతనాల జీవోను కార్మికులందరికీ వర్తింపజేయాలి
- ఆశ, అంగన్వాడీల సమస్యలపై నస్పూర్ ప్రెస్ క్లబ్లో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
నస్పూర్, ఆర్.కె న్యూస్: దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల జీతాలు పెంచకుండా నిత్యావసర సరుకులు, కూరగాయలు, పుస్తకాల ధరలు, ఆసుపత్రి ఖర్చులు పెంచుతూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో గురువారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, నేడు సుమారు రెండు లక్షల పరిశ్రమలను మూసివేసి కార్మికులను ఉపాధికి దూరం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పాలడుగు భాస్కర్ ఆరోపించారు. మహిళలకు కేవలం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే సరిపోదని, వారికి సరైన ఉపాధి చూపించి పనిచేసే మహిళా కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోను ప్రకటించినప్పటికీ, అది రాష్ట్రంలోని ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ వీఓఏ ఉద్యోగులు, హమాలీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్, మెడికల్ రిప్స్ లాంటి రంగాల కార్మికులకు వర్తించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వీరిని కార్మికులుగా గుర్తించకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ఆందోళనలను, పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.







