మంచిర్యాలలోని పలు డివిజన్లలో ఓటరు సవరణ ప్రక్రియ
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కు రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9, 10, 30, 31, 33, 34, 37 డివిజన్లలో బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు ఎస్ఐఆర్ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై నిర్వహించిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి, వారికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఉండేందుకు బూత్ స్థాయి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రజలు తమ ఇంటికి వచ్చే అధికారులకు పూర్తి వివరాలు అందించి ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, టీపీసీసీ సభ్యుడు నూకల రమేష్, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







