అమ్మవారిని దర్శించుకున్న మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ హమాలీవాడలోని నల్ల పోచమ్మ దేవాలయంలో ఆషాఢమాస బోనాల జాతరను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్లతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసిన మేయర్, డిప్యూటీ మేయర్లు పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. జగన్మాత నల్ల పోచమ్మ అమ్మవారి దివ్య కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో మంచిర్యాల పట్టణం అన్ని రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు స్థానిక కార్పొరేటర్ నల్ల శంకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, జోగిని నిషా క్రాంతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.







