సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంద నరసింహారావు, తుమ్మల రాజారెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణిలో పర్యటనలు చేస్తున్నారే తప్ప సంస్థకు రావాల్సిన బకాయిలు ఇప్పించే ప్రయత్నాలు చేయకుండా ఆర్థికంగా నష్టం చేస్తున్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు, వేజ్ బోర్డు మెంబర్ మంద నరసింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. శ్రీరాంపూర్ లోని సీఐటీయూ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కొత్త గనులకు అనుమతుల కొరకు ఒత్తిడి తెచ్చి నూతన గనులను సాధించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజా ప్రతినిధులు డిపెండెంట్లకు నియామక పత్రాలు కేవలం మార్చి వరకే ఇవ్వడం వల్ల మిగిలిన వారు తీవ్ర నిరాశతో ఎదురు చూస్తున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వారికి, విజిలెన్స్ ఎంక్వయిరీ పేరిట నిలిపివేసిన డిపెండెంట్లకు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కాకుండా యాజమాన్యమే తక్షణమే ఆఫీస్ ఆర్డర్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం సరికాదని, బోర్డు కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఇన్వాలిడేషన్ శాతం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్, బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు నరేడ్ల వెంకట రెడ్డి, పెరుక సదానందంతో పాటు పెద్ద సంఖ్యలో యూనియన్ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.







