- ఒడిశా నుంచి తెలంగాణకు చేరిన తొలి రైల్వే రేకు
- సింగరేణి విస్తరణకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం: భట్టి విక్రమార్క
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ఒడిశా రాష్ట్రంలోని నైనీ గని నుంచి లోడ్ చేసిన తొలి బొగ్గు రైల్వే రేకు సుమారు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (ఎస్టీపీపీ) గురువారం ఉదయం చేరుకుంది. ఇతర రాష్ట్రంలోని సంస్థ గని నుంచి తెలంగాణకు బొగ్గు సరఫరా కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. హిందోల్ రైల్వే సైడింగ్లో లోడ్ చేసిన 59 వేగన్ల ద్వారా సుమారు 4,000 టన్నుల జి-10 గ్రేడ్ బొగ్గు చేరింది. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు వీడియో సందేశం ద్వారా కార్మికులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని, సింగరేణి పటిష్టతకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. ఇటీవల తాడిచెర్ల-2, మణుగూరు డిప్సైడ్ బ్లాకులను సాధించామని, క్రిటికల్, రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలోనూ అడుగుపెట్టి సింగరేణిని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతామన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న తొలి రైల్వే రేకుకు డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, ఎం. తిరుమలరావు ఘన స్వాగతం పలికి, అన్లోడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ అవసరాలకు పెద్దపీట వేస్తున్నామని, ప్రస్తుతం మరో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ యూనిట్ నిర్మాణంలో ఉందని వారు తెలిపారు. ప్రశాంతంగా సాగిన ఈ రవాణాకు సహకరించిన తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు, రైల్వేలకు సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడి చిరంజీవి, జీఎం నరసింహ రావు, జీఎం సూర్యనారాయణ రాజు, గుర్తింపు కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రం, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి గౌడ్, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







