వ్యాపారులకు నోటీసులు అందజేత
సోన్, ఆర్.కె న్యూస్: “ప్లాస్టిక్ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అని ఎంపీఓ జడి జ్యోతి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని న్యూ వెల్మల్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. గ్రామంలోని వ్యాపార, దుకాణ సముదాయాల వద్దకు వెళ్లి, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను విక్రయించవద్దని హెచ్చరించారు. దుకాణాల వద్ద పరిశుభ్రత పాటించాలని, లేనిపక్షంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం చర్యలు తీసుకుని జరిమానా విధిస్తామని తెలిపారు. అనంతరం దుకాణ యజమానులకు నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భూపాల్ రెడ్డి, కారోబార్ ప్రవీణ్, జిలకర వేణు, భాస్కర్, భోజన్న, ధోని భీమేష్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.







