- సిఈఆర్ క్లబ్లో అంబేద్కర్ జీవితాధారిత నాటిక ప్రదర్శన
- ఆదివారం సత్యశోధన నాటకాన్ని వీక్షించాలని నిర్వాహకుల పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితంపై ప్రదర్శించిన సంఘం శరణం గచ్ఛామి నాటకం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నస్పూర్ సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలోని గోదావరి ఫంక్షన్ హాల్లో ఈ నాటికను ప్రదర్శించారు. సింగరేణి యాజమాన్యం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ నాటకాన్ని వీక్షించేందుకు సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంబేద్కర్ జీవిత విశేషాలను నేటి తరానికి కళ్లకు కట్టేలా ఎంతో ఆసక్తిగా ఈ నాటికలో ప్రదర్శించారని వీక్షకులు అభిప్రాయపడ్డారు. కాగా, ఆదివారం సాయంత్రం ఇదే ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పూలే జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న సత్యశోధన నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నాటక ప్రదర్శనకు సైతం ప్రజలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ప్రతినిధులు బాజీ సైదా, ముస్కే సమ్మయ్య, మోతుకూరి కొమురయ్య, ఎస్ ఓ టూ జీఎం కృష్ణ ప్రసాద్, ఏజీఎం సుమలత, డీజీఎంలు అనిల్ కుమార్, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, స్థానికులు, చిన్నారులు హాజరయ్యారు.







