- షిర్కే సెంటర్లో ప్రజా పోరు యాత్ర ప్రారంభం
- సెప్టెంబర్ 1న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ వ్యాపారుల అభివృద్ధినే దేశ అభివృద్ధిగా చూస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు విమర్శించారు. నిరసిస్తూ సీపీఐ చేపట్టిన ప్రజా పోరు యాత్ర మూడో రోజు కార్యక్రమాన్ని ఆదివారం నస్పూర్ పట్టణంలోని షిర్కే సెంటర్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ఈ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు ఎందుకు పెంచడం లేదో బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని మేకల దాసు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ధరలను నియంత్రించడంలో, పేద విద్యార్థులకు విద్యను అందించడంలో, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెంది అబద్ధపు ప్రచారాలతో కాలాన్ని వెళ్లదీస్తోందని ఆరోపించారు. దేశంలో పేద ప్రజల సామాజిక, నైతిక అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. విద్య, వైద్యం ప్రతి పేదవాడికి అందుబాటులోకి రావాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచడం ద్వారా మాత్రమే ఉపాధి భద్రత, దేశాభివృద్ధి సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు, ఎస్కే బాజీ సైదా, కొట్టే కిషన్ రావు, మోత్కూరు కొమురయ్య, గునిగంటి నర్సింగరావు, సురేష్, చిలుక రామచందర్ పాల్గొన్నారు.







