అల్లూరి సీతారామరాజు నగర్లో సమస్యల పరిశీలన, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం సాధ్యమవుతుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ అల్లూరి సీతారామరాజు నగర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పారిశుద్ధ్య పనులు, రోడ్ల పరిస్థితి, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై స్థానికులతో చర్చించారు. డివిజన్లో ఎలాంటి సమస్యలున్నా వెంటనే తన దృష్టికి గానీ, మున్సిపల్ అధికారుల దృష్టికి గానీ తీసుకురావాలని మేయర్ సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డివిజన్ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించడంతో పాటు డ్రైనేజీలలో పూడికతీత పనులను చేయించారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు డివిజన్ ఆఫీసర్ రాజమణి, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపతి తిరుపతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.







