సంస్థ లాభాలు వెంటనే ప్రకటించాలి
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: గత ఆర్థిక సంవత్సరం పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సంస్థ లాభాలు ప్రకటించకపోవడం సరికాదని, తక్షణమే లాభాలను వెల్లడించి కంపెనీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్లోని యూనియన్ కార్యాలయంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు ఉప ప్రధాన కార్యదర్శి రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సంస్థ అభివృద్ధి పేరిట సుమారు రూ. 6,000 కోట్లు పక్కన పెట్టిన యాజమాన్యం, ఆ నిధులతో ఎంతమేర అభివృద్ధి పనులు చేపట్టిందో స్పష్టం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు నాణ్యమైన బూట్లు, బిట్లు, డ్రిల్ రాడ్లు, హాలేజ్ రోప్లు, రెయిన్ కోట్లు, సెక్యూరిటీ సిబ్బందికి యూనిఫాం వంటి రక్షణ పరికరాలను సమయానికి అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల వేతనాల నుంచి రికవరీ చేసిన సీఎంపీఎఫ్ సొమ్మును ఖాతాల్లో జమ చేస్తున్నప్పటికీ, వివరాలు అప్డేట్ చేయకపోవడం సీఎంపీఎఫ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, దీనిపై సింగరేణి అధికారులు బాధ్యత తీసుకుని కార్మికులకు పే-స్లిప్పులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు వెంగల శ్రీనివాస్, సాయిళ్ల శ్రీనివాస్, తోడే సుధాకర్, మీడివెల్లి శ్రీనివాస్, వెంకట రెడ్డి, పేరుక సదానందం, సిరికొండ శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.







