ముదికుంట అటవీ ప్రాంతంలో ఊట నీటి నిల్వకు ఏర్పాట్లు
జైపూర్, ఆర్.కె న్యూస్: వేసవిలో మూగజీవాలైన వన్యప్రాణులు తాగునీరు దొరకక పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు చిరు ప్రయత్నం చేశామని టీజీఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ తెలిపారు. మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలం ముదికుంట అటవీ ప్రాంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం వన్యప్రాణుల కోసం తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్లాంటేషన్లలో సహజంగా లభించే ఊట నీటిని నిల్వ చేయడం ద్వారా జంతువుల దాహార్తి తీర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ముదికుంట అటవీ ప్రాంతంలోని ప్లాంటేషన్లలో ఒక కాలువ వద్ద నీటి ఊటను ప్లాంటేషన్ వాచర్ శంకర్ గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మేనేజర్ వెంటనే దానికి ఒక కార్యరూపం ఇచ్చారు. కొంతమంది కూలీల సహాయంతో ఆ నీటి ఊట వద్ద పేరుకుపోయిన మట్టి పూడికను తొలగింపజేశారు. నీరు వృధాగా పోకుండా ఒక అడ్డుకట్ట నిర్మించారు. దీనివల్ల అక్కడ నీరు నిల్వ ఉండి వన్యప్రాణులు తాగడానికి అనువుగా మారింది. ఎండలు తీవ్రంగా మండుతున్న తరుణంలో అడవులు, ప్లాంటేషన్లలో సంచరించే వన్యప్రాణులకు నీటి ఎద్దడి కలగకుండా ఈ చర్యలు చేపట్టారు. అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానిక సిబ్బంది అప్రమత్తతతో సహజ నీటి వనరులను గుర్తించి అభివృద్ధి చేయడంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







