నస్పూర్, ఆర్.కె న్యూస్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి అధికారుల నిరసన కార్యక్రమాలు ఉధృతమవుతున్నాయి. ఈ నెల 19న శ్రీరాంపూర్ ఏరియాతో పాటు సింగరేణిలోని అన్ని రీజియన్లలో భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం అధికారులు మరోసారి ఆందోళనకు దిగారు. ఉదయం నుండి అధికారులు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం సాయంత్రం వేళ జీఎం కార్యాలయ ప్రాంగణంలో చేరి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సీఎంఓఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు లక్కాకుల మహేష్ నాయకత్వంలో అధికారులు జీఎం కార్యాలయ వేదిక వద్ద తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్పందించకపోతే వచ్చే సోమవారం నుండి నిరాహార దీక్షలు చేపట్టడానికి సైతం వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎంఓఏఐ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ సెక్రటరీ మల్లయ్య, జాయింట్ సెక్రటరీ భీమన్న, ట్రెజరర్ పద్మలతో పాటు శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, విభాగాలకు చెందిన అధికారులు, మహిళా అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
24 June 2026
మంచిర్యాల 32వ డివిజన్లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎంత త్వరగా చేకూరుతాయో అనడానికి వేగంగా పూర్తవుతున్న ఈ ఇందిరమ్మ గృహాలే నిదర్శనం అని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో లబ్ధిదారులైన కటకం రజిత, సత్యనారాయణ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి నూతన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అండదండలతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. గృహ ప్రవేశానికి విచ్చేసిన మేయర్ ధర్ని మధుకర్ను లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వార్డు అధ్యక్షులు గోపతి తిరుపతి, రెంక రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి
సోన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సోన్ మండల కేంద్రం లో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం జరిగింది.నేటి యువత మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. యువత ఎటువంటి దురాలవాట్లకు బానిస కాకుండా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎస్సై గోపి, ఏ ఎస్ ఐ దేవన్న, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



