నస్పూర్, ఆర్.కె న్యూస్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి అధికారుల నిరసన కార్యక్రమాలు ఉధృతమవుతున్నాయి. ఈ నెల 19న శ్రీరాంపూర్ ఏరియాతో పాటు సింగరేణిలోని అన్ని రీజియన్లలో భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం అధికారులు మరోసారి ఆందోళనకు దిగారు. ఉదయం నుండి అధికారులు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం సాయంత్రం వేళ జీఎం కార్యాలయ ప్రాంగణంలో చేరి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సీఎంఓఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు లక్కాకుల మహేష్ నాయకత్వంలో అధికారులు జీఎం కార్యాలయ వేదిక వద్ద తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్పందించకపోతే వచ్చే సోమవారం నుండి నిరాహార దీక్షలు చేపట్టడానికి సైతం వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎంఓఏఐ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ సెక్రటరీ మల్లయ్య, జాయింట్ సెక్రటరీ భీమన్న, ట్రెజరర్ పద్మలతో పాటు శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, విభాగాలకు చెందిన అధికారులు, మహిళా అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
12







