సింగరేణి సంస్థ చేపడుతున్న రెండవ దశ 232 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం కోసం హైదరాబాద్ సింగరేణి భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి దేశవ్యాప్తంగా 10 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. వీటిలో టాటా సోలార్ పవర్ తో పాటు, ఎన్రిచ్ ఎనర్జీ, నోవాస్ గ్రీన్ ఇంజనీరింగ్, ఎర్త్ ఇన్ ప్రాజెక్ట్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని సింగరేణి చేపట్టనున్న 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్లల నిర్మాణ విధివిధానాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సింగరేణి సోలార్ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్ వి కె శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (సోలార్) జానకిరామ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ 8 ఏరియాలల్లో చేపట్టనున్న సోలార్ ప్లాంట్ల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మొత్తం 232 మెగావాట్లకు సంబంధించి మూడు టెండర్లుగా నిర్మాణ ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ ప్రదేశాలను, అక్కడికి గల రవాణా సౌకర్యాలు నిర్మాణ ఏజెన్సీలు స్వయంగా పరిశీలించవచ్చని ఆహ్వానించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే తన మొదటి దశ 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో 224 మెగావాట్ల ప్లాంట్లలను విజయవంతంగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని ఈ సందార్భంగా సింగరేణి అధికారులు వివరించారు. ఈనెల 25వ తేదీ లోగా టెండర్లు సమర్పించాలని, టెండర్లు ఖరారైన తర్వాత కచ్చితంగా ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని, నిర్మాణ దశలను బట్టి బిల్లులను ఎప్పటికప్పుడు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లించడం జరుగుతుందని సింగరేణి ఆర్థిక విభాగం అధికారులు వివరించారు. సింగరేణి సంస్థకు పని చేయడం ఒక మంచి అవకాశం గా తాము భావిస్తామని ప్రీ బిడ్ కు విచ్చేసిన ఏజెన్సీల వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ (మెటీరియల్ ప్రొక్యూర్మెంట్) మల్లెల సుబ్బారావు, జనరల్ మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ) సుబ్బారావు, జనరల్ మేనేజర్ (వర్క్ షాప్స్) ఫ్రిజరాల్డ్, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్.వి.కె.వి.రాజు తదితరులు పాల్గొన్నారు.
261