– నిధులు విడుదల చేసిన డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరాం
– అత్యధిక ఎరియర్స్ పొందిన ఉద్యోగులకు చెక్కుల అందజేత
– దసరా, దీపావళి బోనస్ లు సకాలంలో చెల్లిస్తాం
– డైరెక్టర్ డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరాం
ఆర్.కె న్యూస్ ,నస్పూర్: సింగరేణి కార్మికులకు 11వ వేజ్ బోర్డు బకాయిలు 1450 కోట్ల రూపాయలు యాజమాన్యం గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరాం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆన్ లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లో మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం.సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్.బలరాం మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా ఎరియర్స్ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అన్నారు. తొలుత రెండు దఫాలుగా ఎరియర్స్ చెల్లించాలని భావించినప్పటికీ, సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు అనుకున్న సమయానికి కన్నా ముందే ఒకేసారి ఎరియర్స్ చెల్లింపుకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు. 11వ వేజ్ బోర్డు జీతాలు కూడా సింగరేణి సంస్థ కోల్ ఇండియా కన్నా ముందే అమలు జరిపిందని ఆయన గుర్తు చేశారు. 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ కోల్ ఇండియాలోని కొన్ని సబ్సిడరీ కంపెనీలు ఇంకా చెల్లించలేదని, దశలవారీగా చెల్లించడానికి సమాయత్తం అవుతున్నాయని తెలిపారు. సింగరేణి సంస్థ ఒక్కసారిగా ఎరియర్స్ ను కార్మికుల ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. కార్మికులకు చెల్లించే ఎరియర్స్ లో ఇన్ కంటాక్స్, సీఎంపిఎఫ్, పెన్షన్ కు చెల్లించవలసి ఉన్న సొమ్ము మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన 700 కోట్ల రూపాయల లాభాల బోనస్ ను దసరా పండుగకు ముందుగానే చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని, పి.ఎల్.ఆర్ బోనస్ ను దీపావళి పండుగకు ముందే చెల్లించడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. ఎరియర్స్ బోనస్ చెల్లింపుల విషయంలో కొందరు అనవసర అపోహలు కలిగిస్తున్నారని, కార్మికులు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ అడగకముందే ఎరియర్స్, బోనస్ చెల్లింపును సింగరేణి తన బాధ్యతగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. పెద్ద మొత్తంలో ఎరియర్స్ పొందిన కార్మికులు ఈ సొమ్మును పొదుపుగా వాడుకోవాలని, కుటుంబ భవిష్యత్తుకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమానికి సింగరేణి సంస్థ అంకితమై పని చేస్తుందని ఉద్యోగులు కూడా తమ పని గంటలు సద్విని చేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని, ఇదే విధంగా మరిన్ని లాభాలు, సంక్షేమం అందుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో అత్యధిక ఎరియర్స్ పొందిన లచ్చయ్య, (రూ 6.97 లక్షలు) రవి బాబు (రూ.6.81 లక్షలు) సత్యనారాయణ రెడ్డి (6.69లక్షలు) లకు డైరెక్టర్ ఎన్.బలరాం, జిఎం కోఆర్డినేషన్ ఎం.సురేష్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్ వి.రాజశేఖర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
242