- క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు హర్షణీయం
- మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్ , మంచిర్యాల: నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణలో మంజూరు అయిన నాలుగు క్యాన్సర్ ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటు చేయడం హర్షణీయమని, ఇందుకు కృషి చేసిన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ లకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. ముల్కల్ల వద్ద గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ ఆరంభమైందని, బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దూరభారం తగ్గుతుందని తెలిపారు. డిసెంబరులో వేంపల్లిని పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంత్ నగర్ లో ఎయిర్ పోర్ట్ మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు. మంచిర్యాలలో రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ట్రామా ఆసుపత్రి, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం, క్యాన్సర్, ఆయుష్ ఆసుపత్రులు ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కోర్టు భవనాల నిర్మాణానికి 81 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు. కాగజ్ నగర్ కు వెళ్లాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రి మంచిర్యాలకు మంజూరు అయిందని, కలెక్టర్ కార్యాలయం పక్కన స్థలం కేటాయించినట్లు తెలిపారు. రాళ్ళవాగు పై వంతెన నిర్మాణం, వంద ఫీట్ల రోడ్డుకు ఉన్న ఆటంకాలను తొలగిస్తామని చెప్పారు. మంచిర్యాలలో 12 ఎకరాల్లో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని, మంచిర్యాలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిపేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.