- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు
నస్పూర్, మార్చి 27 (ఆర్.కె న్యూస్): కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు కార్మికవర్గం సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ లో జరిగిన మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై హమాలీ యూనియన్ సమావేశానికి ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మే 20న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని కార్మికవర్గాన్ని కోరారు. దేశంలో కార్మిక వర్గానికి హక్కులు లేకుండా కార్పొరేట్ అనుకూల శక్తులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని, కార్మిక చట్ట సవరణలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు, సివిల్ సప్లై హమాలీ కార్మికులు పానుగంటి సత్యనారాయణ, తిప్పని సత్తయ్య, పోరండ్ల సంపత్, నరేష్, రాజన్న, మామిడి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.