మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‘వార్త’ దినపత్రిక కాలసూచికలను ఆవిష్కరించిన కలెక్టర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేయడంలో మీడియా కీలకమైన వారధిలా పనిచేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో ‘వార్త’ దినపత్రికకు సంబంధించిన నూతన సంవత్సర కాలసూచికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించాల్సిన బాధ్యత ప్రసార మాధ్యమాలపై ఉందన్నారు. అదే సమయంలో ప్రజలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై మీడియా ఎప్పటికప్పుడు స్పందించాలని, వార్తా సేకరణలో వాస్తవాలను మాత్రమే ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. జర్నలిజం విలువలను కాపాడుతూ సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం. కృష్ణమూర్తి, వార్త దినపత్రిక ప్రతినిధులు కోడూరి శ్రీనివాస్, మేకల భీమయ్య, క్యాతం రాజేష్, ప్రభుదాస్, అహ్మద్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.







