ఐబీ చౌరస్తాలో బీసీ హక్కుల పోరాట సమితి వినూత్న నిరసన..
భారతరత్న ఇవ్వాలని డిమాండ్
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ‘జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్న కాలంలోనే సావిత్రిబాయి పూలే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అణగారిన వర్గాలకు విద్యను అందించిన ధీరవనిత అని కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బీసీ మహిళల పట్ల వివక్ష చూపడమేనని మండిపడ్డారు. సావిత్రిబాయి పూలేకు తక్షణమే ‘భారతరత్న’ ప్రకటించాలని, కేంద్ర సెక్రటేరియట్లో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు బీసీ మహిళలను చైతన్యం చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, కార్యదర్శి శాఖ పోరి భీమ్సేన్, నాయకులు గజెల్లి వెంకటయ్య, చంద్రగిరి చంద్రమౌళి, రాజన్న చారి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.







