శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయం: నూతన ఎస్హెచ్ఓ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా 2020 బ్యాచ్కు చెందిన ఎస్సై ఎం. ప్రశాంత్ బాధ్యతలు స్వీకరించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సీసీఎస్ లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు సిసిసి నస్పూర్ ఎస్హెచ్ఓగా కొనసాగిన యు. ఉపేందర్ రావు రామగుండం టాస్క్ ఫోర్స్కు బదిలీ అయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. వాహనదారులు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్హెచ్ఓ సూచించారు. ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు, స్టేషన్ సిబ్బంది నూతన ఎస్హెచ్ఓకు సాదర స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు.







