- జిల్లాలోని అన్ని వార్డుల్లోనూ పోటీ చేస్తాం
- ఏఏపీ జిల్లా అధ్యక్షులు నయీం పాషా
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కార్యక్షేత్రంలోకి దిగుతోందని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నయీం పాషా ప్రకటించారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి నిర్మూలన ధ్యేయంగా పుట్టిన తమ పార్టీ, రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మున్సిపల్ డివిజన్లు, వార్డులలో అభ్యర్థులను బరిలోకి దించుతుందని స్పష్టం చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న అభ్యర్థులు పార్టీ తరపున పోటీ చేసేందుకు జిల్లా నాయకత్వాన్ని సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. గడిచిన కాలంలో జిల్లాలో ప్రజల పక్షాన నిలబడి తాము చేసిన అనేక పోరాటాలను నయీమ్ పాషా గుర్తు చేశారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని పాత కలెక్టరేట్ భవనాన్ని ఎస్సీ బాలికల హాస్టల్కు కేటాయించేలా చేయడంలో ఏఏపీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడామని వివరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాలమ్మ కాలనీలో ప్రజలకు ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డును అక్కడి నుండి తరలించేందుకు తాము ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ విజయ్ కాంత్, ఉపాధ్యక్షులు రాజేందర్, కోశాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







