- భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
- జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: స్థానిక ముక్కిడి పోచమ్మ ఆలయ ఆవరణలో సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లను ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఆలయ పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. అత్యవసర వైద్యం కోసం ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్ సదుపాయం సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. భద్రత పరంగా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజల సహకారంతో జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, డీజీఎంలు రవీందర్, ఎం. రాజేష్, సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డి, సీనియర్ పీవో ఎస్. సురేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.








