- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి
- ఫిబ్రవరి 12న సమ్మెకు పిలుపు.. ఓబీ కంపెనీల్లో పెచ్చుమీరిన అవినీతి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో గత మూడేళ్లుగా జరిగిన అన్ని టెండర్లపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూటెక్ గనిపై పిట్ సెక్రటరీ పెరిక సదానందం అధ్యక్షతన నిర్వహించిన కార్మికుల ముచ్చట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందమర్రిలో జరిగిన 17వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాజారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వాలు, యూనియన్లు మారినా కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని విమర్శించారు. ఓబీ కంపెనీల్లో జరుగుతున్న అవకతవకల వల్ల అవినీతి పెరిగిపోయి, టెండర్లు రద్దు చేసే స్థాయికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని మండిపడ్డారు. రిటైర్మెంట్ తర్వాత అధికారులు ప్రైవేట్ కంపెనీల్లో చేరడం వల్ల సింగరేణి రహస్యాలు బయటకు వెళ్తున్నాయని, దీనిపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం నైని బ్లాక్ మాత్రమే కాకుండా, గత మూడేళ్ల టెండర్లన్నింటినీ విచారించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న నూతన లేబర్ కోడ్ల వల్ల బొగ్గు గని కార్మికుల వేజ్ బోర్డుకు, సీఎంపీఎఫ్ నిధులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న చేపట్టబోయే సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న సొంతింటి కల పోరాటానికి ఆకర్షితులై పోలు సంపత్, నునేటి శ్రీనివాస్ యూనియన్లో చేరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్, బోడకుంట శంకర్, శ్రీపతి బానేస్, వెంకట్ రెడ్డి, జోర్క వెంకటేష్, అల్వాల అభిలాష్, శెట్టిపల్లి తిరుపతి, అశోక్ పాల్గొన్నారు.








