భక్తుల సౌకర్యార్థం వెన్సా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమానుల ఉదారత
మల్యాల, ఆర్.కె న్యూస్: కొండగట్టు అంజన్న క్షేత్రానికి వచ్చే భక్తుల రవాణా సౌకర్యార్థం వెన్సా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమానులు పి. రాందేవ్ రావు, లక్ష్మణ్ రావు ఎలక్ట్రిక్ ఆటోను విరాళంగా అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని చెక్ పోస్ట్ నుండి ప్రధాన దేవాలయం వరకు భక్తులను చేరవేసేందుకు ఈ వాహనాన్ని వినియోగించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీకాంత్ రావు తెలిపారు. కరీంనగర్కు చెందిన దాతలు శనివారం ఆలయాన్ని సందర్శించి వాహన తాళాలను అధికారులకు అందజేశారు. కొండపైకి నడవలేని వృద్ధులు, వికలాంగులు, ఇతర భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని సమర్పించడం పట్ల ఆలయ యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. భక్తుల సౌకర్యాల కల్పనలో దాతలు ముందుకు రావడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ వాహనం అందుబాటులోకి రావడంతో భక్తులకు రవాణా ఇబ్బందులు తొలగనున్నాయి.







