- మున్సిపల్ కమిషనర్కు వినతి
- పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని లక్ష్మీ నగర్, వికాస్ నగర్ కాలనీలు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 51వ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. లక్ష్మీ నగర్, వికాస్ నగర్, ఒడ్డేర కాలనీలు దశాబ్ద కాలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల కాలంలో పాలకులు, అధికారులు ఈ డివిజన్ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించారని నేతలు ఆరోపించారు. మురుగు కాల్వలు లేక వ్యర్థ జలాలు రోడ్లపైనే ప్రవహిస్తున్నాయని, దీనివల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలు టైఫాయిడ్, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. లక్ష్మీ నగర్ ఐదో నంబర్ రోడ్డులో గతంలో శంకుస్థాపన చేసినా నేటికీ పనులు ప్రారంభించలేదని, అక్కడ వెంటనే డబుల్ సిమెంట్ రోడ్డు నిర్మించి డివైడర్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీరు అందిస్తామన్న హామీలు అమలుకు నోచుకోలేదని, ప్రజలు వేల రూపాయలు వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ఇతర వార్డుల్లో ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ అమరవీరుల స్మృతి వనం ప్రస్తుతం నామరూపాలు లేకుండా పోయి చెత్తాచెదారానికి నిలయంగా మారిందని, ఆ స్థలాన్ని అక్రమార్కుల బారి నుండి రక్షించి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇంటి పన్నుల వసూళ్లపై చూపే శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా చూపాలని అధికారులను కోరారు.







