- ప్రజా సమస్యలే ఎజెండాగా పోరు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నయీమ్ పాషా పిలుపునిచ్చారు. నస్పూర్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఆప్ కట్టుబడి ఉందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో వీధి దీపాలు, రహదారుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులకు రేషన్ కార్డులు అందడం లేదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన దరఖాస్తులు చేసుకోవడానికి వెబ్సైట్ సక్రమంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు లేక స్థానిక యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అభ్యర్థిగా అనపర్తి యువరాజ్, 17వ డివిజన్ అభ్యర్థిగా దొమ్మటి రవికుమార్, 50వ డివిజన్ అభ్యర్థిగా షహానా పోటీలో ఉంటారని ప్రకటించారు. ఆప్ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుల్లో నెలకొన్న మౌలిక వసతుల కొరతను తీరుస్తామన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నగర్లోని పాత కలెక్టరేట్ భవనాన్ని ఎస్సీ బాలికల హాస్టల్కు కేటాయించేలా కృషి చేశామని గుర్తు చేశారు. ఆండాలమ్మ కాలనీ డంపింగ్ యార్డ్ తరలింపుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు సాగుతుందని నయీమ్ పాషా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంటు రాజేందర్, సభ్యుడు కుమారస్వామి, అభ్యర్థులు యువరాజ్, రవికుమార్, షహానా పాల్గొన్నారు.







