🔴 మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
🔴 గోదావరి తీరంలో వైభవంగా సమ్మక్క జాతర
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: సమ్మక్క-సారలమ్మ తల్లుల ఆశీస్సులతో మంచిర్యాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల గోదావరి తీరంలోని గౌతమేశ్వర ఆలయ ప్రాంగణానికి సమ్మక్క తల్లిని గురువారం కన్నుల పండుగగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూనకాలు, భక్తి నినాదాలతో అమ్మవారికి స్వాగతం పలికారు. వన దేవతలకు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భక్తులకు కొంగుబంగారమైన వనదేవతల దీవెనలు అందరిపై ఉండాలని కోరారు. జాతర నిర్వహణ కోసం విశేష కృషి చేసిన సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ ప్రాంతం భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి పరివాహక ప్రాంతంలో జరిగిన ఈ వేడుకకు భక్తులు పోటెత్తారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.







