8
- 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యనస్పూర్, ఆర్.కె న్యూస్: ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు, వేజ్ బోర్డు శాశ్వత సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ సీహెచ్పీలో నిర్వహించిన గేట్ మీటింగ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన సీహెచ్పీ కమిటీ నాయకులను ఈ సందర్భంగా కార్మికులకు, యాజమాన్యానికి పరిచయం చేశారు. సీహెచ్పీలోని పీ-2, పీ-3 క్రషర్ల వద్ద ఏసీలు సరిగా పనిచేయకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సీతారామయ్య పేర్కొన్నారు. వాటిని వెంటనే బాగు చేయడంతో పాటు ఫ్యాబ్రికేషన్ షెడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. క్యాంటీన్లో మెరుగైన వసతులు కల్పించాలని, నాణ్యమైన అల్పాహారం అందించేలా తగిన మెటీరియల్ అందుబాటులో ఉంచాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను ఇప్పటికే యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని, వారు సానుకూలంగా స్పందించి తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చారని వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ఫిట్ కమిటీ సమిష్టిగా పనిచేస్తూ కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సీతారామయ్య మండిపడ్డారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడాన్ని నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, పిట్ కార్యదర్శులు గునిగంటి నర్సింగరావు, జిల్లాల రవి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అప్రోజ్ ఖాన్, పిట్ నాయకులు సాయి రాజు, అశోక రెడ్డి, శ్రీనివాస్, గజ్జి రమేష్, మావో, జనగామ నారాయణ, కల్లేపల్లి శ్రీనివాస్, జోగుల ప్రభాకర్, కలమడుగు లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.







