ఉద్యోగ భద్రత కల్పించాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడికి ఆపరేటర్ల విజ్ఞప్తి
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించేందుకు టీఎన్జీవో కేంద్ర సంఘం ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంచిర్యాల టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి భరోసా ఇచ్చారు. రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని కోరుతూ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ నేతృత్వంలో శుక్రవారం మంచిర్యాల టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లు గత 20 ఏళ్లుగా రెవెన్యూ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఈ సందర్భంగా నాయకులు వివరించారు.
ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో తాము నిరంతరం శ్రమిస్తున్నామని ఆపరేటర్లు తెలిపారు. 2009, 2014, 2018, 2023 ఎన్నికల విధుల్లో చురుగ్గా పాల్గొన్నట్లు గుర్తు చేశారు. 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన (ఎల్ఆర్యూపీ) అమల్లోనూ తమ పాత్ర కీలకమని పేర్కొన్నారు. యవ్వన జీవితమంతా రెవెన్యూ శాఖకే అంకితం చేశామని ఇప్పుడు ఇతర ఉద్యోగాలకు వెళ్లే వయస్సు, అవకాశం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆపరేటర్ల విజ్ఞప్తిపై స్పందించిన శ్రీహరి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి టీఎన్జీవో సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ నేతృత్వంలో ముఖ్యమంత్రిని అలాగే రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి ఆపరేటర్లకు న్యాయం జరిగేలా చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. తమ సమస్యపై సానుకూలంగా స్పందించినందుకు ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, అనిత, రవి, షారూక్ పాల్గొన్నారు.







