భీమారం పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
భీమారం, ఆర్.కె న్యూస్: పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకూడదని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పీఎం శ్రీ పాఠశాలల వ్యక్తిత్వ వికాస నిపుణుడు గుండేటి యోగేశ్వర్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా భీమారం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నో పరీక్షలు రాసిన అనుభవంతో పదో తరగతిని అవలీలగా ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల్లో విజయం సాధించడానికి పాటించాల్సిన సూత్రాలు, బలాలు, బలహీనతలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పరీక్షల సమయంలో అనుసరించాల్సిన చదువు పద్ధతులు, జ్ఞాపకశక్తిని పెంచుకునే చిట్కాలను విద్యార్థులకు వివరించారు. పేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రముఖుల జీవన గాథలను వివరిస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి, పరీక్షలను నిర్భయంగా ఎదుర్కొంటామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, సమన్వయకర్త తిరుపతి, ఉపాధ్యాయులు షారీక్, మారయ్య, సలీం, శ్రీదేవి, గోవర్ధన చారి, ఐటీ నిష్ణాతులు శరత్ చంద్ర, రాజశేఖర్ పాల్గొన్నారు.








