శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
ఫిబ్రవరిలో 1,87,955 టన్నుల బొగ్గు ఉత్పత్తి
నస్పూర్, ఆర్.కె న్యూస్: వంద శాతం ఉత్పత్తి సాధించిన గనుల ఉద్యోగులను ఆదర్శంగా తీసుకుని అందరూ రక్షణతో కూడిన లక్ష్య సాధనకు తోడ్పడాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను శ్రీరాంపూర్ ఏరియాలో ఫిబ్రవరి మాసంలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను శనివారం వెల్లడించారు. ఈ నెలలో నిర్దేశించిన 5,40,700 టన్నుల లక్ష్యానికి గాను 1,87,955 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు వివరించారు. ఎస్పార్పీ-1, ఆర్.కె న్యూ టెక్ భూగర్భ గనులు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని తెలిపారు. ఆర్.కె-5, ఎస్పార్పీ-3, 3ఏ, ఐకే-1ఏ గనులు ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని కనబరిచాయని పేర్కొన్నారు. ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఎదురయ్యాయని మునిగంటి శ్రీనివాస్ వివరించారు. కొన్ని ఓబీ కాంట్రాక్టర్ల ఒప్పంద సమస్యల వల్ల ఆశించిన స్థాయిలో మట్టి తొలగింపు జరగలేదని చెప్పారు. దీని ప్రభావంతో బొగ్గు ఉత్పత్తి కొంత వెనకబడినట్లు స్పష్టం చేశారు. సంస్థ ఉన్నతి కోసం ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేయాలని కోరారు. రక్షణ నియమాలను పాటిస్తూనే ఉత్పత్తి వేగాన్ని పెంచాలని సూచించారు. ఏరియాలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను జీఎం వివరించారు. కారుణ్య నియామకాల కింద మెడికల్ ఇన్వాలిడేషన్ పొందిన ఉద్యోగుల వారసులు 3,828 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. 277 మందికి ఎస్ఎల్పీ, 21 మందికి ఎంఎంసీ చెల్లింపులు పూర్తి చేసినట్లు చెప్పారు. పదవీ విరమణ చేసిన వారికి సీపీఆర్ఎంఎస్ పథకం ద్వారా 9,737 మెడికల్ కార్డులు అందజేశామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ పెద్దపీట వేస్తోందని పునరుద్ఘాటించారు. గత నెలలో కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆరో విడత ప్రయాస్ కోఆర్డినేషన్ సమావేశం విజయవంతంగా పూర్తయిందన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా కొత్త లేబర్ కోడ్స్పై అవగాహన సదస్సు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, సీనియర్ పీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.







