ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్లో పాల్గొన్న 100 మంది విద్యార్థులు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ విద్యార్థులు శనివారం హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. గృహ పరిస్థితులు, పర్యావరణం, పరిశుభ్రత అలవాట్లు, దోమల నియంత్రణ వంటి అంశాలపై సమగ్రంగా సర్వే చేశారు. కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 100 మంది విద్యార్థులు పాల్గొని సుమారు 250 కుటుంబాలను సందర్శించారు. ప్రతి విద్యార్థికి ఐదు కుటుంబాల వివరాలు సేకరించే బాధ్యతను కళాశాల యాజమాన్యం అప్పగించింది. సర్వేలో గుర్తించిన అనారోగ్య సమస్యలకు ప్రాథమిక చికిత్స సూచించారు. మెరుగైన వైద్యం అవసరమైన బాధితులను సమీప ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేశారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జి. శ్రీకాంత్ పర్యవేక్షణలో డాక్టర్ సౌజన్య, డాక్టర్ సుమలత, సహాయక సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజారోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు క్షేత్రస్థాయి అనుభవం కోసం ఈ కార్యక్రమం దోహదపడింది.








