సింగరేణి ఉద్యానవన మహిళా కార్మికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న మేయర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మహిళా సాధికారతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యంమని మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ ధర్ని మధుకర్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి ఉద్యానవన కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ మహిళా కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన మేయర్ ధర్ని మధుకర్ ను కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సమాజంలోని అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. ఉద్యానవన విభాగంలో పనిచేస్తున్న మహిళల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ప్రతి మహిళా ఉద్యోగి ఆత్మగౌరవంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు తమ పనితీరుతో సింగరేణి ప్రాంగణాలను అందంగా తీర్చిదిద్దుతున్నారని మేయర్ మెచ్చుకున్నారు. వారి సంక్షేమానికి నగర పాలక సంస్థ తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పనాస రవీందర్, సాదినేని సదానందం, పెద్ద సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు.







